Menu

did-you-know ?

Jaathakam Leni Variki Santhi

జాతకం లేని వారికి శాంతులు

వర్తమానంతో పాటు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. జీవితంలో జరిగే మంచి చెడులను తెలుసుకునేందుకు జ్యోతిష్కులను, పండితులను ఆశ్రయిస్తుంటారు. కొందరు హస్త సాముద్రికం ఆధారంగా చెబుతుండగా, ఇంకొందరు సంఖ్యాశాస్ర్తాన్ని ఆధారంగా చేసుకుని, మరికొందరు గ్రహ సంచారాల ఆధారంగా జాతకాలు చెబుతుంటారు. చేతిలోని రేఖల ఆధారంగా చెప్పేది హస్త సాముద్రికం కాగా, గ్రహ గతుల ఆధారంగా చెప్పేది జన్మకుండలి ఆధారిత జ్యోతిష్యం.

జన్మకుండలి ఆధారంగా జాతకాలు తెలుసుకునేందుకు వ్యక్తి జన్మించిన తేదీ (నెల, సంవత్సరంతో సహా), సమయం, పుట్టిన ప్రదేశం తప్పనిసరి. ఇవన్నీ కచ్చితంగా ఉంటే జాతకం కూడా కచ్చితంగా చెప్పే అవకాశం ఉంటుంది. జనన సమయం సరిగా ఉండాలి. ఇదే లగ్నం నిర్ణయించేందుకు ముఖ్య ఆధారం. ఈ లగ్నాన్ని బట్టే ఫలితాలు నిర్ధారించడం సాధ్యమవుతుంది.

అలాగే, లగ్నం కచ్చితంగా నిర్ధారించేందుకు జన్మించిన ప్రదేశం కూడా ముఖ్యమే. సూర్యోదయ సమయాలు ఆయా ప్రాంతాలనుబట్టి కొన్ని నిమిషాలు హెచ్చుతగ్గులు ఉంటాయి. దీని ఆధారంగా లగ్న నిర్ణయం చేయాల్సి ఉంటుంది. మేషాది మీనరాశి వరకు ఒక్కొక్క రాశి ప్రమాణం సుమారు 2 గంటల వరకు ఉండవచ్చు. ఒక్కొక్కప్పుడు నిమిషాల తేడాలో లగ్నం మారవచ్చు. జన్మించిన ప్రదేశం తెలుసుకోవడం ద్వారా లగ్నంలో తేడాలు రాకుండా చూసే అవకాశముంటుంది.

కొందరికి జన్మించిన తేదీ, సమయం తెలియదు. వారి పెద్దలు చెప్పే కొండ గుర్తుల ద్వారా కొంతవరకు సంవత్సరం, తేదీ, నక్షత్రం వంటివి నిర్ధారించవచ్చు. అయితే, జన్మ కుండలి వేయడం దీనివల్ల సాధ్యం కాదు. కేవలం రాశి ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.

జాతకం లేని వారికి శాంతులు అంటే జన్మించిన సమయం లేని వారికి. అయితే జాతకం ఉన్న వాళ్ళుకూడా చేసుకోవచ్చును.

ఆదిత్య హృదయం:
ఇది సూర్యునికి సంబంధించినది. ఈ ఆదిత్య హృదయం రామ రావణ యుద్ధ సమయంలో అగస్త్య మహర్షి రామునికి ఉపదేసించినాడు. దీనిని రోజూ ప్రాతః సమయమున పటించుట వలన ఆయురారోగ్యాలను, అష్ట ఐశ్వర్యాలను పొందుతారు. ఇంకా.. మనిషిలో దాగిఉన్న కామ,క్రోధాది అంతః శత్రువులను నాశనం చేస్తుంది. పాపాలను నాశనం చేస్తుంది. చింతల నుంచి, దుఃఖముల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతి నిత్యం జపిస్తే విజయం తప్పక లభిస్తుంది. ఇది పఠించిన పిదపనే రాముడు, రావణుని పై విజయం సాధించాడు. గోధుమలతో చేసిన పదార్ధములు, క్యారెట్, రాగి చెంబులో నీళ్లు తాగడం వలన కూడా సూర్య గ్రహా దోషాలు తొలుగుతాయి.

రుణ విమోచక అంగారక(కుజ) స్తోత్రం:
జీవితంలో మనకు ఎదురైనా అనేక ఇబ్బందులకు అప్పులు చేస్తూ ఉంటారు. వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతుంటే “రుణ విమోచక అంగారక(కుజ) స్తోత్రం” 41 రోజులు పారాయణ చేస్తూ , నవగ్రహాలకు రోజూ 27 ప్రదక్షిణలు చేయాలి. చివరి రోజు కందులు, ఎర్ర గుడ్డ, ధనము దక్షిణగా పెట్టి,కుజునకు మీ పేరు మీద అష్టోత్తరం చేయించండి. మీ అప్పులు తప్పక తీరు తాయి.

ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నారా?
మీరు “విష్ణు సహస్ర నామ స్తోత్రం” 41 రోజులు పారాయణ చేయండి. సాయంత్రం వేళ రోజూ చేస్తే ఇంకా మంచిది. చివరి రోజు విష్ణు ఆలయానికి వెళ్లి గోత్ర నామాలతో స్వామికి అష్టోత్తరం చేఇంచండి. మీ బాధలు తగ్గి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది.

మీకు వివాహమై ఎంతో కాలమైనా సంతానము లేదా?
మీరు ఒకసారి కాళహస్తి వెళ్లి రాహు,కేతు,కుజ గ్రహాలకు “సర్ప దోష నివారణ పూజ” చేయించండి. తర్వాత ఎక్కడైనా నాగ ప్రతిష్ట చేయించండి. కర్నాటక రాష్ట్రంలో నున్న విదురాస్వద్ధలో చేయిస్తే ఇంకా మంచిది. లేదా” సంతాన గోపాలకృష్ణ వ్రతం” నియమ నిబంధనలతో ఒకసారి మీ ఇంటిలో చేయండి. వీలుంటే రెండు శాంతి ప్రక్రియలు చేస్తే ఇంకా మంచిది. తప్పక సంతానం కలుగుతుంది.

వివాహం ఆలస్య మవుతోందా?
మీరు “రుక్మిణి కల్యాణం” పారాయణ చేయండి. లేదా 41రోజులు , రోజుకి 41 ప్రదక్షిణలు నవగ్రహాలకు చేసి, చివరి రోజు నవగ్రహాలకు పూజ చేయండి. అయితే నవగ్రహాలకు తిరిగే మొదటిరోజు మీ కోరిక చెప్పుకొని మొదలు పెట్టండి. తప్పక వివాహము జరుగుతుంది.

ధనమునకు ఇబ్బంది పడుతున్నారా?
ధన కారకుడైన సాయి బాబా పారాయణ 41 రోజులు చేస్తూ, ప్రతిరోజూ సాయిబాబా మందిరమునకు వెళ్లి, ఆలయమును శుబ్రపరుస్తూ(అంటే భక్తులు పారవేసిన టెంకాయ చిప్పలు, అరటి తొక్కలు, ప్రసాదం తిన్న ఆకులు) బాబాని దర్శించుకోవాలి. 41వ రోజు బూంది ఒక కిలో పావుకిలో బాబాకి నైవేద్యం పెట్టి, పేదలకు పంచండి. మీ ఇబ్బందులు తగ్గిపోతాయి.

డబ్బు ఇబ్బందులకు ఇంకొక శాంతి ప్రక్రియ
ప్రతి నెలలో ఒక మాస శివరాత్రి వస్తుంది. ఆ మాస శివరాత్రి రోజున శివునకు “ఏకన్యాస రుద్రాభిషేకం” చేయండి. అలాగా 8 మాస శివరాత్రులు శివునకు రుద్రాభిషేకాలు చేయించండి. మీ ధన ఇబ్బందులు తప్పక తొలిగి పోతాయి. ధనము బాగా సంపాదించాలి అనుకున్న నిత్యమూ “శ్రీ సూక్తము” పారాయణ చేయవలెను.

హనుమాన్ చాలీసా
హనుమంతుడు కల్పవృక్షం లాంటి వాడు. కల్పవృక్షాన్ని ఆశ్రయించిన అన్ని కోరికలు క్షణంలో నెరవేరుతవి. అటువంటి కల్పవృక్షం దరికి చేర్చగల చక్కని సులభమైన మార్గం “హనుమాన్ చాలీసా”. ఈ హనుమాన్ చాలీసాను దినమునకు 11 పర్యాయములు చొప్పున మండలం(40 రోజులు) పారాయణం చేసిన సర్వ కార్యసిద్ధి కలుగును. ఒకే ఆసనమున కూర్చుని 108 పర్యాయములు పఠించిన విశేష కార్యసిద్ధి కలుగును. నిత్యమూ 3 వేళలా ఒక పర్యాయము చదివిన వారి యోగక్షేమములు భక్త రక్షకుడగు శ్రీ హనుమంతుడు తాను స్వయంగా చూచుకొనును.

Rasi-Types

Rasi

 

 

రాశులు – ఆకార స్వరూపాలు, లక్షణాలు

రాశి స్వరూప లక్షణాల ద్వారా జాతకుని లగ్నం గాని,రాశి గాని ఉన్నప్పుడు ఆయా లక్షణాలు కలిగి ఉంటారు. జాతక చక్ర విశ్లేషణలో జాతకుని స్వభావ లక్షణాలు తెలుసుకోవచ్చును.

మేషరాశిలో జన్మించినవారి లక్షణాలు
ఈ రాశివారికి దూకుడు ఎక్కువ. అంటే మేషమంటే గొర్రె. గొర్రెకు ఉండే తీవ్రత, ధైర్యం, శక్తి, కలహాశక్తి, ఆలోచన లేకుండా అడుగుముందుకేయడం ఉంటుంది. అలాగే ఈ రాశి వారి లక్షణాలు ఉంటాయి. సూక్ష్మగ్రాహులు, ధన సంపాదనాపరులు, ఉపకారబుద్ధిగలవారు, పట్టుదలతో కార్యసిద్ధిని పొందుతారు. అనారోగ్యమును లెక్కచేసే రకం కాదు.

వృషభరాశిలో జన్మించినవారి లక్షణాలు
వృషభరాశి అంటే ఎద్దు. ఈ రాశివారు స్ధిరత్వం కలిగి ఉంటారు. పోషించే స్వభావం, ఎత్తైన భుజాలు, పెరిగిన కండలు, కాంతి కల కన్నులు, విశాలమైన ముఖం, గొడ్డు చాకిరీ చేస్తారు. ఓర్పు, సహనం ఎక్కువగా ఉంటుంది. ఇతరుల ఆధీనంలో ఉంటారు. ఇతరులకు బాగా సహాయపడతారు. ఆరోగ్యవంతులై ఎల్లప్పుడు సంతోషము కలిగిఉంటారు. ఉద్యోగ నిర్వహణ మందు నేర్పరులు, పనులను, వాయిదావేయడం అంటే ఈ రాశి వారికి ఇష్టముండదు.

మిధునరాశిలో జన్మించినవారి లక్షణాలు
మిధునరాశిది పురుషుడు ఒక చేత్తో గధ, స్త్రీ ఒక చేత్తో వీణ ధరించిన స్వరూపం. భార్యాభర్తలు ఇద్దరు యుక్తాయుక్త జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు వీరు మానవతా దృక్పదం కలిగి ఉంటారు. ఒకరి కోసం ఒకరు అనే భావన, వైవిధ్యం, కొంతకాలం ఆర్ధిక ప్రతికూలత, కొంతకాలం ఆర్ధిక అనుకూలత, రెండు వృత్తుల ద్వారా ఆదాయం కలిగి ఉంటారు. ఎక్కువగా కోరికలుకలవారు, విలాస వస్తువులకై విరివిగా డబ్బు ఖర్చు చేయుదురు. ఎవరినైనను నమ్ముతారు. ఒక్కొక్కప్పుడు మోసపోవుచుందురు.

కర్కాటక రాశిలో జన్మించినవారి లక్షణాలు
ఆలోచనాపరులై కార్యనిర్వహణము చేస్తారు. ఆశలు అధికం. పట్టుదల కృషి విడువక కార్యసిద్ధిని పడయుదురు. తప్పించుకొనే తెలివితేటలు, స్వతంత్రత, అపకారం చేయుటకు వెనకాడకపోవటం, జల భూచరమైన ఆటుపోటులు, వృద్ధి క్ష్యయాలు, మొదలైన లక్షణ ద్వయం కలిగి ఉంటారు.

సింహరాశిలో జన్మించినవారి లక్షణాలు
సింహం. మృగ స్వభావం, బిగ్గరగా అరుచుట, గాండ్రించుట, భయం కలిగించుట, స్వేచ్ఛగా సంచరించుట, జంకు బొంకు లేకపోవుట, అందరిని మించిపోవాలనే స్వభావం, న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. విద్యాబుద్దులు కలిగి ఉంటారు. ఉన్నతికోసం పాటుపడుదురు. వృత్తి ఉద్యోగములలో రాణిస్తారు. శత్రువర్గమును ఉపేక్షించరు.

కన్యరాశిలో జన్మించినవారి లక్షణాలు
సముద్రంలో తెప్పపై ఒక చేత్తో దీపం, ఒక చేత్తో సస్యమును ధరించిన స్త్రీ. కన్య పుష్పవతి కాని స్త్రీ. విశేషమైన ఊహాలు, సిగ్గు, బిడియం, దగ్గరకు వచ్చి మాట్లాడుటకు భయం, సభలో మాట్లాడుటకు బెరుకు. అమాయక ప్రవర్తన కలిగి ఉంటారు. పెద్దల అండ లేనిదే ఏ పని చేయలేరు. స్త్రీకి ఉండే వాత్సల్యం, అభిమానం, బంధు ప్రేమ. తన బాధను, శ్రమను ఇతరులు గుర్తించాలనే భావం కలిగి ఉంటారు. లేమిలోపుట్టి లేమిలోనే అంతరింతురు. మధ్యలో ఔన్నత్యమును పొంది సుఖజీవనము చేయగలుగుతారు.

తుల రాశిలో జన్మించినవారి లక్షణాలు
త్రాసు ధరించిన పురుషుడు.  సమాజంలో వర్తకుడు త్రాసు ధరిస్తాడు.స్ధిర చిత్తమును కలిగి ఉంటారు. ధర్మాధర్మముల విచక్షణ, సమయోచితంగా ప్రవర్తించుట, ఇతరులకు సహాయపడుట, అవకాశాలు, ధనం, కాలం, సాధనాలు సరిగా వినియోగించుట, చిన్న వస్తువులను, సంఘటనలను సరిగా గుర్తుంచుకోవటం. ఆరోగ్యవంతులై ఐశ్వర్యములను లెక్కించక మిత్రులకు ఉపకృశి గావింతురు. కృషించి పనులు చేయుదురు.

వృశ్చికరాశిలో జన్మించినవారి లక్షణాలు
వృశ్చికం అంటే తేలు. తేలు కనపడితే జనం చంపుతారు. కనుక ఇతరుల నుంచి తనను కాపాడుకోవటం కోసం రహస్య ప్రవర్తనం కలిగి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి రహస్య ప్రవర్తన ఉండే సూచనలు. తనకు ఈ మాత్రం హాని కలగకుండా చూసుకొనుచు.. ఇతరులకు హాని కలిగించు మాటలు, పనులు చేయుదురు. వృశ్చిక రాశి వారు పగ కలిగి ఉంటారు. పౌరుషవంతులై ఏదో ఒక పని చేయుచునే ఉందురు. ఎవరినీ కూడా ఖాతరుచేసే రకం కాదు. ఉన్నదానితోనే సంతృప్తిపడుదురు.

ధనుస్సురాశిలో జన్మించినవారి లక్షణాలు
నడుము కింది భాగం అశ్వ రూపం కలిగి వీళ్ళు ధరించిన మానవ రూపం. ధనుర్ధారుడికి ఉండే ఏకాగ్రత, కార్యదీక్ష, పట్టుదల కలిగి ఉంటారు. కదలిక లేని స్వభావం, ఇతరుల ఆదేశానుసారం నడుచుకుందురు. చాలాజాగ్రత్తగా అన్ని విషయాలు పర్యవేక్షింతురు. తెలిసినది తక్కువైనా ఎక్కువదానికే గురి చూస్తారు. చాలామందితో గూడ సరదాగా పనిపాట్లు చేయుచుందురు.

మకరరాశిలో జన్మించినవారి లక్షణాలు
లేడి ముఖం కలిగి మొసలి రూపం కలిగి ఉన్న రూపం. లేడికి ఉండే సుకుమారం, లావణ్యత, నాజూకుతనం కలిగి ఉందురు. మొసలికి ఉండే పట్టుదల, పొంచి ఉండి అవకాశం రాగానే కబళించే స్వభావం, ఏమి ఎరుగని మనస్తత్వం, సమయం చూసి పట్టు పడతారు. పట్టిన పట్టు వదలరు. ఇతరుల కష్టసుఖములు ఆలోచించరు. తన పని పూర్తియైతే చాలును. చదువు సంధ్యలందు మనస్సులగ్నపరచి ఉన్నత స్థానమును పొందగలరు.

కుంభరాశిలో జన్మించినవారి లక్షణాలు
నీటి కడవ ధరించిన మానవ  రూపం. కొత్త నీరు, నవ జీవనం కలిగి ఉంటారు. ఈర్య అసూయలతో విద్యలు సాధిస్తారు. ధనము కొరకు పలుపాట్లు పడుతారు. సంకుచిత స్వభావము కలిగి ఉన్నందున పెద్ద పెద్ద అవకాశాలు పోగొట్టుకుందురు. బద్ధకస్తులు, చలనం లేక మొండిగా ఉండుట, ఏ విషయంలో అయిన త్వరగా బయట పడుదురు. సమర్ధులు, భద్ర పరుచుకుందురు.

మీనరాశిలో జన్మించినవారి లక్షణాలు
రెండుచేపలు ఒకదాని తోక వైపు మరొక చేప తల ఉన్నట్లుండే రూపం. సంగీత, సాహిత్యములపై ఆసక్తి. ధనమును గణించుటయేతప్ప, ఖర్చుపెట్టుట యెరుగరు. ఒకరిని చూసి మరొకరు సర్ధుకుపోవటం, నీటి ప్రవాహంలో ప్రయాణం. సమయమును బట్టి వృద్ధి చెందగలరు. ఎరవేస్తే వలలో పడుతారు. ఆశ చూపిస్తే లొంగిపోతారు. కొత్త వారితో స్నేహములు పెంచుకుందురు. ఆరోగ్యవంతులుగా జీవిస్తారు.