Menu

remedies for graha dosha

remedies for graha dosha

జాతక దోషాలు నివారణ ఎలా?

విశ్వంలోని ప్రతి జీవి తన గమ్యాన్ని తానే సాధించుకుంటుంది. కర్మ కొద్దీ కష్టాలు ప్రాప్తిస్తాయని తాను అర్థం చేసుకోవాలి. కర్మ సిద్ధాంతం మాత్రమే జీవితానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, దానిని ఏ విధంగా ఎదుర్కోవాలనే మానసిక సంసిద్ధతను జీవికి కల్గిస్తుంది. ఇటువంటి జ్ఞానం వ్యక్తి జీవితాన్ని గాని, తోటి వారిని గాని, దైవాన్ని గాని నిందించకుండా చేస్తుంది. వ్యక్తుల జీవితాలలో ఏ తప్పులు జరగనప్పటికీ, వారు ఎందుకు బాధలు పడతారో.. ఓ భగవత్ సంబంధమైన కర్మ సిద్ధాంతం మాత్రమే వివరిస్తుంది.

జాతకంలోని 12 భావాలలో ఎక్కడ లోపాలు లేవని, కొందరు పండితులు చెప్పినప్పటికీ, ఈ జాతకులు మాత్రం సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ప్రత్యేక గ్రహస్థితులు అనేక రకాలుగా ప్రతి వారి జాతకాలలో అంతర్లీనంగా దాగి ఉంటాయి.

పితరులు చేసిన పుణ్య కార్యాల ఫలిత ప్రభావం ఉన్ననూ, అది జాతకులలో  అదృష్ట , ఆకర్షిత గ్రహస్థితిగా ఉంటే మంచిదే. కాని ఇట్టి అదృష్ట , ఆకర్షిత గ్రహస్థితి ప్రతివారి జాతకాలలో ఉండదు. కొంత మందికి మాత్రమే పరిమితం. అలా కాక తమ పితరులు చేసిన పాప కార్యాల ఫలితాల ప్రభావాన్ని వారి సంతానం అందుకొనే గ్రహస్థితి ఉంటే దానిని దురదృష్ట ఆకర్షిత గ్రహస్థితిగా భావించాలి. ఇలాంటి దురదృష్ట ఆకర్షిత గ్రహస్థితి కూడా అందరికీ ఉండదు. కొంత మందికి మాత్రమే పరిమితం.

పితరులు చేసిన కార్యాల ప్రభావం అదృష్ట, దురదృష్ట ఆకర్షిత గ్రహస్థితులుగా జాతకాలలో ఉంటుంటాయి. అయితే ఇవి అందరి జాతకాలలో ఉంటాయనుకోవటం పొరపాటు. వ్యక్తులు చేసే కార్యాకార్యాల ప్రభావం.. వారు మరణించిన తదుపరి సంతతికి ఫలితాలను చూపుతూనే ఉంటాయి. అయితే ఇక్కడొక విషయాన్ని గమనించాలి. ఒక వ్యక్తికి నలుగురు సంతానం ఉన్నారనుకుందాం, ఆ వ్యక్తి చనిపోయే లోపు ఎవ్వరికీ ఎలాంటి సమస్యలను ఇవ్వకుండా మంచి భావంతో దాన ధర్మాలు చేసి కాలం చేశాడు. మరి ఈ దాన ధర్మాలు చేసిన వ్యక్తి చనిపోయిన తదుపరి… వారి సంతతిపై వారికున్న నలుగురు సంతానంపై అనుకూలమైన ఫలితాలను ఇస్తాయని అనుకోవాలి. కాని ఈ నలుగురు సంతానంలో తమ చనిపోయిన తండ్రి చేసిన విశేష కార్యాల ప్రభావ ఫలితాలు.. తాను తన జాతకరీత్యా పొందే అవకాశము గల గ్రహస్థితి ఉన్నప్పుడే.. ఆ సంతతికి పూర్ణ ఫలాలు లభిస్తాయి.

అలా కాకుండా ఒక వ్యక్తి అందరినీ హింస పెడుతూ, దాన ధర్మాలు చేయకుండా, నేరాలు కుట్రలు కుతంత్రాలు, హత్యా రాజకీయాలు మొదలైనవాటిని ప్రేరేపిస్తూ కాలం చేశాడని అనుకుందాం. ఈ వ్యక్తికి కూడా నలుగురు సంతానం ఉన్నారనుకుందాం. మరి ఇప్పుడు ఈ దుర్మార్గపు లక్షణాలు గల వ్యక్తి చనిపోయిన తదుపరి.. వాటి ప్రభావ ఫలితాలు నలుగురు సంతతిపై ఉంటుందా ? ఒక్కోసారి ఈ నలుగురు సంతతిపై వాటి ఫలితాలు ఉండవచ్చు లేక ఉండకపోవచ్చు లేక కొంతమందికే ఉండవచ్చు. దీని అర్థం ఏమిటంటే, ఆ వ్యక్తికి కలిగిన సంతానం జన్మ జాతకాల ప్రకారం.. తమ చనిపోయిన తండ్రి చేసిన దుర్మార్గపు కార్యాల ప్రభావ ఫలితాలు సంతతికి ప్రాప్తించే గ్రహ స్థితి ఉండవచ్చు లేక ఉండకపోవచ్చు.

ప్రారబ్ధం ప్రకారం ప్రతీది జరిగి తీరవలసినదే. అందుచేత జన్మ జాతకాలలో దృష్టముగాఉన్న (కనిపించే) గ్రహస్థితులు కాకుండా అదృష్టంగా (కనపడకుండా అంతర్లీనంగా ఉండే) గ్రహస్థితుల వలన ఫలితాలు జాతకులకు ఒక్కోసారి అనూహ్యంగా విజయావకాశాలు ఇస్తుంటాయి లేదా సమస్యాత్మకంగా ఉంటుంటాయి.

ప్రారబ్దమనేది 2 రకాలుగా ఉంటుంటుంది. ఒకటి దృష్ట ప్రారబ్ధం, రెండు అదృష్ట ప్రారబ్ధం. దృష్ట అంటే కనపడునది అని అర్ధము. దృష్ట ప్రారబ్దం వలన ఫలితాలు మంచిగాను, చెడుగాను వస్తుంటాయి. వాటిని జాతక పరంగా, గ్రహ సంచార స్థితుల రీత్యా తెలుసుకోవచ్చు.  అదృష్ట అంటే కనపడనిది అని అర్థము. ఇక్కడ అదృష్ట ప్రారబ్దం అంటే ఏదో విజయం వరించిందనే అర్థం కాదు. ఒక వ్యక్తి మంచి ఫలితాలను అనుభవిస్తుంటాడు. చెడు ఫలితాలను అనుభవిస్తుంటాడు. ఇట్టి ఫలితాలను వారి వారి జాతక చక్రాల ద్వారా ప్రత్యక్షంగా గమనించలేము. చాలా బాగా లోతుగా పరిశీలిస్తేనే గోచరమవుతుంది. వీటినే అంతర్లీన జాతక దోషాలలో గమనించవచ్చు.

దృష్ట ప్రారబ్దం అంటే జాతక చక్రాలలో పైకి కనపడే గ్రహ సంచార స్థితులను బట్టి అంశాలు ఇలా ఇలా ఉంటాయని… దీనితో పాటు పితరులు చేసిన కార్యాకార్యాలను బట్టి కూడా గ్రహస్థితులు ఉంటాయి గనుక, వాటి ఫలితాలు అలా జరగబోతున్నాయని… దానికి తగిన జాగ్రత్తలు ఫలాని విధంగా తీసుకుంటూ ఉండాలని, ఫలాని శాంతి క్రియలు జరుపుకోవాలని… చెప్తుంటారు.

అదృష్ట ప్రారబ్దం అంటే విజయం కాదు. గత జన్మలో చేసిన మంచి చెడు అంశాలను బట్టి, పితరులు చేసిన కార్యాకార్యాలను బట్టి కూడా గ్రహస్థితులు ఉంటాయి. గనుక వాటి ఫలితాలు ఒక్కోసారి ఆశ్చర్యకరమైన రీతిలో వ్యక్తులు ఊహించకుండానే విజయాలను పొందుతూ ఉంటారు. అదే రీతిలో ఊహించకుండానే అపజయాలను పొందుతుంటారు.

జాతక దోషాలకు ధాన్యాలు
ప్రతి గ్రహానికీ వాటికి సంబంధించిన ధాన్యాలున్నాయి. ఎవరికైనా జాతక చక్రంలో దోషాలేవైనా ఉన్నా, గ్రహ దోషాలవల్ల అనారోగ్యంపాలయినా, ఆ గ్రహాలకి సంబంధించిన ధాన్యాలను దానం చేయడం లేదా, ఆవుకు తినిపించడం వల్ల మరియు జప తర్పణ హోమదికాలు చేయుట వల్ల  దోషాలు పోతాయని, స్వస్ధత చేకూరుతుంది అని అనేక జ్యోతిష గ్రధములు వివరించినవి.

రవి          –         గోధుమలు
చంద్రుడు  –        బియ్యం
కుజుడు     –         కందులు
బుధుడు   –         పెసలు
గురువు     –         శనగలు
శుక్రుడు     –        బొబ్బర్లు
శని            –         నువ్వులు
రాహువు    –        మినుములు
కేతువు     –         ఉలవలు